Friday 10 February 2023

మంచిర్యాల జిల్లా అసమగ్ర స్వరూపం..పార్ట్ 4


 "*మంచిర్యాల జిల్లా అసమగ్ర స్వరూపం"

సమీక్ష, విమర్శ, విశ్లేషణ

- బొడ్డు మహేందర్, చెన్నూరు

9963427242

పార్ట్ -4

15 వ వ్యాసం దండేపల్లి మండలం కు చెందిన ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయుడు నాగవర్మ ముత్యం రాసిన "జిల్లా అనువాద సాహిత్యం." మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర లో ప్రస్తావించని(విస్మరణకు గురైన) ఎన్.రాధే శ్యామ్ యొక్క అనువాద సాహిత్యం కృషిని గురించి ప్రధానంగా ఈ వ్యాసం రాసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం 3 పేజీల వ్యాసంలో 1 పేజీ రాధే శ్యామ్ గురించే ఉంటుంది. అయినా బాగుంది. కానీ సంస్కృతం నుండి ఎక్కువగా తెనుగీకరించిన నాగినేని లీలా ప్రసాద్ పుస్తకాలను నామ మాత్రంగా కూడ ప్రస్తావించకపోవడం సబబు కాదనిపిస్తుంది. అలాగే కామారెడ్డికి చెందిన ప్రముఖ అనువాదకుడు, రచయిత ఎనిశెట్టి శంకర్ కొమురం భీమ్ నవలని ఆంగ్లంలోకి తర్జుమా చేసాడు.ఆయన పేరు పేర్కొనలేదు. ఆయనే2021లో ప్రచురించిన Sling Shot - An Anthology of translation poems లో మన జిల్లా కవి నూటెంకి రవీంద్ర రాసిన "మరణమంటే" అనే కవితకు ఆంగ్ల అనువాదం Death means  పేరుతో ఉంది. కాబట్టి పరిశోధన అనుకూలంగా ఆధారాలు ఇవ్వడం మంచిది అని నా అభిప్రాయం. ఇక కేవలం ఇక్కడి అనువాద రచయితల గురించే కాకుండా, ఇక్కడి వారి సాహిత్యం ఏవేమి ఇతర భాషల్లోకి అనువాదమయ్యాయో కొంత పరిశోధించి, పరిశీలించి వ్యాసకర్త  రాసినట్టు తెలుస్తోంది. ఇందుకు వారు అభినందనీయులు. 

అయితే ఈ క్రమంలో తోకల రాజేశం అయినా, ముత్యం నాగవర్మ అయినా ఒక విషయాన్ని మర్చిపోయారు. అదే వీరందరి కన్నా మునుపే  వానమామలై వరదాచార్యులు మరాఠీ నుండి తెలుగులోకి అనువదించిన గీత్ రామాయణం(మరాఠీ నుండి తెలుగులోకి అనువదించడంలో ఉపాధ్యాయుడైన మహంకాళి దత్తాత్రేయ సహకరించారు), స్త్రోత్ర రత్నావళి, అలాగే శాకీర్ అనే ఉర్దూ కవి రాసిన  కవితల్ని "శాకీర్ గీతాంజలి"గా ఉర్దూ నుండి తెలుగుకు చేసిన అనువాద కృషిని గుర్తించలేక పోయారు.(మహంకాళి దత్తాత్రేయ గురించి సాహిత్య చరిత్రలో ఉంది) అలాగే చెన్నూరు కు చెందిన బెల్లంకొండ మల్లారెడ్డి నవయుగ భారతి వారు ప్రచురించిన ఓ 5హిందీ పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. వీటిలో సురేష్ సోనీ అనే రచయిత హిందీలో రాసిన "ఉజ్వల భారతీయ వైజ్ఞానిక పరంపర" అనే హిందీ పుస్తకాన్ని 2009లో అదే పేరుతో తెలుగులోకి అనువదించి రాసిన గ్రంథానికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ వ్యాస  పరంపరలో విస్మరణకు గురైన మరో రచయిత తాండూరు మండలం అచ్చలాపూర్ కు చెందిన వేద పండితుడు అప్పాల శ్యామ్ ప్రణీత్ శర్మ. శ్రీ శివ పార్వతీ కళ్యాణం, జీర్ణోద్ధణ విధి పేరిట ముద్రించిన రెండు గ్రంథాలూ సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించినవే. ఇప్పటివరకు 250కు పైగా వ్యాసాలు వివిధ పత్రికల్లో వచ్చినా, 9 పుస్తకాలు ముద్రించినా కూడ ఈ రచయితకి సరైన గుర్తింపు లభించలేదు. 

కారణం ప్రక్రియల వారీగా వ్యాసాలు రాయడం, అందులో వ్యాసం, ఆధ్యాత్మిక రచనల విభాగాన్ని విస్మరించడం. దీని వల్ల స్వచ్ఛందంగా వ్యాసాల ద్వారా సామాజిక చైతన్యానికి, చరిత్ర నిర్మాణానికి పాటుపడుతున్న ఎందరో విస్మరణకు గురవుతున్నారు. ఉదాహరణకు నస్పూర్ కు చెందిన బి.రాజ్ కుమార్ వంటి పాత్రికేయులు ముద్రించిన పుస్తకాలు("అభివృద్ధి - విధ్వంసం" 2016లో ప్రచురణ )  పరిగణనలోకి రాకుండా పోతున్నాయి. శీలప్ప రామకృష్ణ శాస్త్రి రాసిన ఆర్ష విజ్ఞాన సర్వస్వం, పులి దత్తాత్రేయ శర్మ, కొమ్మేర దత్తు మూర్తి  సంయుక్తంగా సంకలనం చేసిన "ఆపస్తంభీయ అపర కర్మ ప్రయోగ చంద్రిక", వంటి సనాతన ధర్మ సంబంధ పుస్తకాలు మరుగున పడుతున్నాయి. అలాగే వివిధ సంకలనాలలో ప్రచురితమైన అనేక పరిశోధక వ్యాసాలు విలువ లేకుండా పోతున్నాయి. ఉదాహరణకు 2017 ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా మూసీ మాసపత్రిక ప్రచురించిన "31జిల్లాల ఆలోకనం" లో మన జిల్లా గురించి శతావధాని పట్వర్ధన్ ఒక వ్యాసం రాశారు. దాని గురించి ఈ పుస్తకంలో ఎక్కడా ప్రస్తావించలేదు. అలాగే జిల్లా ఏర్పడ్డాక పద్యానికి, అవధాన ప్రక్రియకు పునర్వైభవం తెచ్చే దిశగా ఆయన చేసిన కృషి కూడ ఈ పుస్తకంలో నమోదు కాలేదు. ఇదంతా అంశాల వారీగా విభజించి రాయడం వల్ల కలిగిన లోపం.  ఇలా ప్రక్రియల వారీగా విభజించకుండా వ్యక్తుల వారీగా విషయ సేకరణ చేస్తే ఆయా రచయితల సంపూర్ణ మూర్తిమత్వం, వివిధ రంగాల్లో వారి కృషి వెలుగులోకి వచ్చేది.

ఈ సందర్భంగా రచయితలకు, పాఠకులకు ఒక విషయం గుర్తు చేయాలి అనుకుంటున్న. అదేమిటంటే మన ప్రాంతంలో అక్షరాస్యత శాతమే చాలా తక్కువ. అందునా నిజాంల ఏలుబడిలో చదువంతా ఉర్దూ మాధ్యమంలోనే. అలాంటప్పుడు ఇక్కడ ఉర్దూ సాహిత్యమో, ఉర్దూ లోనే మన చరిత్ర రాయడమో జరిగి ఉంటుంది కదా. మరి వారిని(ఉర్దూ కవులు,రచయితలను) ఎందుకు ఒక్కరు కూడా సంప్రదించే ప్రయత్నం చేయలేదు. వారు ఈ జిల్లాలోనే ఉంటున్నప్పుడు జిల్లా చరిత్ర లో వారి గురించి కూడ రాయాలి కదా. జిల్లా కేవలం తెలుగు సాహిత్య కారులదే కాదు కదా. ఇక్కడి ఉండి ఏ రంగంలో అయినా, ఏ భాష లో అయినా విశిష్ట సేవలు అందించిన వారిని కుల, మత, జాతి , ప్రాంతాలకు అతీతంగా స్మరించడం, గౌరవించడం మన కనీస నైతిక బాధ్యత కాదా.. ఈ కోణంలో ఆలోచించి పరిశోధిస్తే ఎన్ని విషయాలు వెలుగులోకి వచ్చేవో..!! 

మరో విషయం కూడ గుర్తు చేస్తున్న. ఇప్పటివరకు మన జిల్లాకు సంబంధించిన వివరాలు 2 పుస్తకాలలోనే ఉన్నాయి. అవి ఆదిలాబాద్ జిల్లా విజ్ఞాన సర్వస్వం - బి.ఎన్.శాస్త్రి ; మన ఆదిలాబాదు - మడిపల్లి భద్రయ్య   ఈ రెండింటినీ మనం ఆధార గ్రంథాలు గానే స్వీకరించాలి కానీ, ప్రామాణికం అని భావించకూడదు. ఎందుకంటే పరిశీలిస్తే వాటిలోనూ ఎన్నో తప్పులున్నాయి. వాటిని ప్రామాణికం అని భావించిన తోకల రాజేశం రాసిన మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర లోనూ అక్కడక్కడ తప్పులు దొర్లాయి. దాన్నే గుడ్డిగా కాపీ కొట్టేసిన ఈ అసమగ్ర స్వరూపంలో అంతకు మించి తప్పులు ఉన్నాయి. ఉదాహరణకు చెన్నూరుకు సంబంధించి జ్యోతిష్య పండితుడు శ్రీరాంభట్ల చంద్రశేఖర సిద్ధాంతి పార్వతీశ్వర శతకం రచించారు. కానీ తోకల రాజేశం రాసిన పుస్తకంలో హెడింగ్ శ్రీరాం భట్ల వెంకటేశ్వర సిద్ధాంతి అని ఉంటుంది. దాన్ని గుడ్డిగా అనుసరించి రాసిన పెద్ది భరత్ వ్యాసంలోనూ అదే పేరు నమోదైంది.పైగా రెండిటిలోనూ పుస్తకాలు అలభ్యం అని రాశారు. అసలు ఆ పేరు గల రచయిత ఉండనప్పుడు పాఠకులు చదివేది అంతా తప్పుడు చరిత్రనే కదా. దీన్ని నిజమని భావిస్తే చరిత్ర పరిశోధకులు తల పట్టుకుని కూర్చోవాలి. ఇక 2020లో వచ్చిన పుస్తకానికి 2023లో వచ్చిన పుస్తకానికి 3 ఏళ్ల కాల వ్యవధి ఉన్నది. ఎన్నో సాంకేతిక మార్పులు, సాహిత్య తీరులు మారాయి. ఈ కాలాన్ని అప్డేట్ చేయకుంటే ఇప్పటికీ ఆ చంద్రశేఖర సిద్ధాంతి పుస్తకాలు లభ్యం అవట్లేదు అని సరిపెట్టుకుంటాం. అదే అప్డేట్ చేసి ఉంటే, 2021 జనవరి 10న చంద్రశేఖర సిద్ధాంతి రాసిన పార్వతీ శతకం పునర్ముద్రణ పొందిన విషయం తెలిసేది, చరిత్రలో రికార్డు అయ్యేది.

16వ వ్యాసం ప్రభుత్వ ఉపాధ్యాయురాలు లేదాళ్ళ గాయత్రి రాసిన "బాల సాహిత్యం." స్వతహాగా కవయిత్రి,కథకులు అవడం, బాల సాహిత్యంపై మక్కువ కలిగి ఉండటం వల్ల కూడ జిల్లాలోని బాల సాహిత్య కారులపై మంచి సమాచారమే ఇచ్చారు. అయితే శతక సాహిత్యం గురించి రాసిన పెద్ది భరత్ గానీ, బాల సాహిత్యం గురించి రాసిన ఈ వ్యాసకర్త గానీ తోకల రాజేశం నే తొలి బాల కవి గా పేర్కొన్నారు. కానీ ఇప్పటివరకు ప్రచురితమైన అన్ని పుస్తకాల్లోనూ వానమామలై వరదచార్యులు 13వ ఏట(1925సం.) నుండే పద్య రచన,గేయాలు రాసేవారని రికార్డ్ అయ్యి ఉంది. అలాంటప్పుడు 2003 లో రాసిన కవి తొలి బాల కవి ఎలా అవుతాడు. అలాగే పిల్లల కోసం కూడ వానమామలై వరదాచార్యులు "పోతన చరిత్ర" అనే పేరుతోనే సరళ తెలుగులో ఓ పుస్తకాన్ని రచించారు. దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించారు. ప్రస్తుతం ఈ పుస్తకం టిటిడి వారి అధికారిక వెబ్సైట్ లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు కూడ. దీని గురించి రాయలేదు. ఇక 2004లో ప్రచురితమైన "బాల కవితా రసాలం" అనే ఓ పుస్తకాన్ని ఆధారం చేసుకొని అందులో ఉన్న వారందరినీ పేరుపేరున ప్రస్తావించిన పెద్ది భరత్ మరియు ఈ వ్యాసకర్త ల్యాదాల గాయత్రి ఇరువురూ కూడ అదే గ్రంథం ఆధారంగా ఓ ఇద్దరిని తొలి బాల కవయిత్రి, తొలి మహ్మదీయ బాల కవి అని పేర్కొనడం సబబు కాదేమో..!! వారు చేసిన ఈ నిర్ధారణకు ప్రాతిపదిక ఏంటి..? వీరు చేసిన పరిశోధన ఏంటి..? ఇంకా బాల సాహిత్యం అని ప్రత్యేకంగా రాస్తున్నప్పుడు అయినా అనేక మంది బాల కవులు వెలుగులోకి రావడానికి ముఖ్య కారకుడు, బోధకుడు అయిన జక్కేపల్లి నాగేశ్వర రావు కృషిని గురించి మరింత వివరంగా రాయాల్సిన అవసరం ఉంది. కానీ ఈ కోణంలో ఒక ప్రోత్సాహకుడిగా మాత్రమే ఆయన గురించిన ప్రస్తావన ఉంది కానీ, జక్కెపల్లి వారి కృషి ఫలితంగానే బాల కవితా రసాలం, బాల కవుల శతక సంపద ముద్రించబడ్డాయి. ఇందులో "బాల కవుల శతక సంపద" సంకలన గ్రంథం ఆయనకే అంకితమివ్వబడింది. కానీ ఈ విషయాలేవీ రాయలేదు మరియు కనీసం ఈ పుస్తకాలు పేర్లు కూడ పేర్కొనలేదు.అలాగే అనువాద  రచనలు చేసిన బెల్లంకొండ మల్లారెడ్డి 1971-80 మధ్య కాలంలో శిశుమందిర్ పిల్లల కోసం హిందీలో ఉన్న 10కి పైగా  మహనీయుల జీవిత చరిత్రలను,అల్లూరి సీతారామరాజు బుర్ర కథని సరళ తెలుగులోకి అనువదించారు. ఇంకా బాల సాహిత్యం కోసం ప్రత్యేకంగా https://kotthapalli.in అనే ఓ వెబ్సైట్ ను పెట్టిన సత్య ఫౌండేషన్ ఛైర్మన్, సాహితీ పోషకుడు(కవి నీర్ల మధునయ్య రచనల ముద్రణకు ఇతోధికంగా సహకారం అందించారు) చెన్నూరు వాస్తవ్యుడు అయిన పోటు సత్యనారాయణ రెడ్డి కృషిని కూడ రాయాల్సిన అవసరం ఉంది. 2008 సంవత్సరంలో తన అల్లుడైన గడియారం వేంకట నారాయణ శర్మ సహకారంతో స్థాపించిన ఈ వెబ్సైట్ లో ఎక్కువగా అనంతపురం జిల్లాలోని కొత్తపల్లి గ్రామ పాఠశాల విద్యార్థుల రచనలే ఉన్నాయి. అయినప్పటికీ ఓ మూడు సంచికల్లో మన మంచిర్యాల జిల్లాకు చెందిన చెన్నూరు, భావురావు పేట, టేకుమట్ల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కథలు(రాసినవి),పాటలు(గానం చేసినవి) మనకు కన్పిస్తాయి. 2012లో టేకుమట్లకు చెందిన 7వ తరగతి విద్యార్థిని తాటం మానస రాసిన "రహస్యం చెబితే" కథ ముద్రితమైంది. 2013 మార్చిలో చెన్నూరు శిషుమందిర్ విద్యార్థులు రాసిన గొలుసుకట్టు పదాల కథ "ప్రయత్నం - ఫలితం" ప్రచురితమైంది. ఈ సందర్భంగా నిర్వాహకులతో మాట్లాడినప్పుడు వెబ్సైట్ గురించి ఎక్కువగా ప్రచారం చేయకపోవడం, స్థానికంగా విషయ సేకరణ చేయకపోవడం వల్ల ఇక్కడి వారి రచనలు తక్కువగా ఉన్నాయి అని చెప్పారు. అయినా కూడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న బాల సాహిత్యాన్ని వెలికి తీయడానికి తన వంతుగా తన ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహకారం అందించిన  పోటు సత్యనారాయణ రెడ్డి సేవలు వెలకట్టలేనివి. 2008 నుండి 2020 ఫిబ్రవరి వరకు 107సంచికలతో  నిరంతరంగా సేవలు అందించిన ఈ వెబ్సైట్ కరోనా సృష్టించిన ఆర్థిక మాంద్య ప్రభావంతో ఆగిపోయింది. అయినప్పటికీ డొమైన్ ఆక్టివ్ గా ఉంటడం వల్ల దాని పాత సంచికలను ఇప్పటికీ మనం వీక్షించవచ్చు. 

మళ్లీ ఈ వ్యాస విషయానికొస్తే.. ప్రస్తుతం రాస్తున్న బాల కవుల గురించి ఇందులో ప్రస్తావన కూడా లేదు. ఉదాహరణకు చెన్నూరు నుండి చెన్న వేదాంత,లక్షెట్టిపేట కు చెందిన లింగంపల్లి శ్రావణ్ కుమార్ వంటి వారెందరో నిత్యం ఇక్కడి కవి సమ్మేళనాలలో పాల్గొంటూ తమని తాము మెరుగుపర్చుకుంటున్నారు. శ్రావణ్ కుమార్ అయితే ఈ-బుక్స్ ఫార్మెట్ లో The art from my Heart, The undiluted feelings   అనే పేర్లతో 2 ఆంగ్ల కవితల పుస్తకాలని అమెజాన్ కిండల్ ద్వారా అందరికీ అందుబాటులో ఉంచాడు. The Flying Rainbow పేరుతో 100 ఆంగ్ల కవితల పుస్తకాన్ని కూడ ఫిబ్రవరి 15,2022 నాడు ఆవిష్కరించాడు.

17వ వ్యాసం పాత్రికేయులు కొమ్మేర రామమూర్తి రాసిన "సంగీత ప్రపంచంలో జిల్లా వెలుగులు". పేరుకు జిల్లా వెలుగులు అని ఉన్నా ఈ వ్యాసం ప్రధానంగా జక్కేపల్లి వంశంలోని సంగీత కళాకారులను వెలుగులో ఉంచేందుకు రాసింది. మొత్తం 8 పేజీల వ్యాసం లో 6 పేజీలు కేవలం వారి వంశస్థుల కీర్తికే అంకితమైనది. వారు కాకుండా మరో 4 గురి గురించి రాసినా కూడ అందులో గుర్రాల చిలుకలయ్య అలియాస్ శ్రీధర్ గురించిన వివరణ కనీసం సైడ్ హెడింగ్ కి కూడ నోచుకోలేదు. పునః పరిశీలన, ప్రూఫ్ రీడింగ్ చేయకపోవడం వల్ల జరిగిన తప్పిదం ఇది. ఇక ఇందులో పేర్కొన్న వారే కాకుండా ప్రస్తుతం అనేక మంది నూతన కళాకారులకు,గాయకులకు,గేయ రచయితలకు ఊతమిచ్చేలా వారి వారి ఆడియో, వీడియో లకు సంగీతం అందిస్తున్న కరుణాకర్, మాడుగుల వెంకటేష్ ల గురించి ప్రస్తావించి ఉండాల్సింది. కరుణాకర్ మంచిర్యాలలో ఫ్రేయ స్టూడియో ద్వారా, మాడుగుల వెంకటేష్ బెల్లంపల్లిలో స్వరాంజలి మ్యూజిక్ అకాడమీ ద్వారా సంగీతంలో కృషి చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రచయితలు సాహిత్యం మీద పెట్టిన దృష్టి ఇతర కళలపై పెట్టకపోవడం వల్ల ఆయా రంగాల నిపుణుల చరిత్ర మరుగున పడిపోతోంది. ఆ కోణంలో ఈ వ్యాసం తో పాటు రాబోయే మరికొన్ని వ్యాసాలు విలువైనవి అని చెప్పొచ్చు. అయితే మరికొంత పరిశీలన, పరిశోధన చేసి ఉంటే బాగుండేది.

18వ వ్యాసం లక్షెట్టిపేటకు చెందిన  ప్రభుత్వ ఉపాధ్యాయుడు, కవి అయిన నూటెంకి రవీంద్ర రాసిన "జిల్లా శిల్పకారులు - చిత్రకారులు" వస్తుపరంగా ఎంతో వైవిధ్యంతో కూడుకున్న విషయం మరియు ఆ రంగంతో ఎంతో కొంత అభిరుచి, ఆసక్తి ఉన్న వారికే తెలిసే విషయం ఇది. బహుశా వ్యాసకర్త సంతానం సంప్రదాయ చదువులకు భిన్నంగా ఫైన్ ఆర్ట్స్ పై ఫోకస్ పెట్టడం వల్ల వ్యాసకర్త కూడ ఈ అంశంపై లోతైన అధ్యయనం చేసినట్లు కనిపిస్తోంది. 30మంది కళాకారులను ఈ వ్యాసం ద్వారా వ్యాసకర్త వెలుగులోకి తేవడం అభినందనీయం. ఈ వ్యాసంలో లోపాలు వేతకలేను గానీ ప్రస్తుత చిత్రకారులు కొందరు మంచిర్యాలలో చిత్రకళ ఆర్ట్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ను స్థాపించి ఇక్కడి ఔత్సాహిక చిత్రకారులకు ప్రముఖుల చేత శిక్షణ ఇప్పిస్తున్నారు. అలాగే ఇక్కడి కళాకారుల సంక్షేమం కోసం కూడ కృషి చేస్తున్నారు. దీన్ని ప్రస్తావిస్తే బాగుండేది. లేదా వారిని సంప్రదించిన కూడ మరెన్నో విషయాలు తెలిసేవి. ఇక పెద్దపల్లి జిల్లాలోని రామగిరి కోట పై ప్రస్తుతం నెలకొల్పి ఉన్న హనుమాన్ విగ్రహాన్ని చెక్కినది మంచిర్యాల జిల్లాకే చెందిన గడ్డం బాపు అని వికీపీడియా ద్వారా తెలుస్తోంది.

మరికొన్ని వ్యాసాల సమీక్ష సమాలోచన తర్వాతి భాగంలో..

10 February 2023

No comments:

Post a Comment