Thursday 19 January 2023

మంచిర్యాల జిల్లా అసమగ్ర స్వరూపం..పార్ట్ 3


 "మంచిర్యాల జిల్లా అసమగ్ర స్వరూపం"

విమర్శ, విశ్లేషణ, సమీక్ష పార్ట్ 3

- బొడ్డు మహేందర్, చెన్నూరు 9963427242

"మంచిర్యాల జిల్లా అసమగ్ర స్వరూపం" పై నా విమర్శ, విశ్లేషణ, సమీక్ష వ్యాసం పార్ట్ 3 భాగం చాలా పెద్దగా అయిపోయింది. కాబట్టి పార్ట్ 3లో నలుగురు(11-14) వ్యాసకర్తల గురించి ఈరోజు పోస్ట్ చేస్తున్న. ఈ కొంత భాగ వ్యాసమే గత పార్ట్2 తో సమానంగా ఉంది. మిగతా (15-20) వ్యాసకర్తల గురించి మరో భాగంగా పోస్ట్ చేస్తాను. గమనించగలరు.

11వ వ్యాసం ప్రభుత్వ ఉపాధ్యాయురాలు వైద్య సుజాత రాసిన "జిల్లా కథా సాహిత్యం". ప్రముఖ కథా రచయిత అల్లం రాజయ్య తో మొదలుపెట్టి ఒక్క కథని రాసిన జిల్లాలోని వర్ధమాన కవుల వరకు అందరి గురించి బాగానే రాసారు. అయితే అల్లం రాజయ్య కథల గురించి ప్రస్తావిస్తూ ఆయన 2000సంవత్సరం వరకు రాసిన కథలు,4(3+1) కథా సంకలనాల గురించి మాత్రమే రాసారు. బండకింది బతుకులు అనే కథా సంపుటిలోని కథ కూడ "అతడు(అల్లం రాజయ్య సాహిత్యం -6 "లో ముద్రించినట్టు రచయిత్రి గమనించినట్లు లేదు. ఇక 2000 నుండి 2015వరకు తన రచనా వ్యాసంగానికి తాత్కాలిక విరామం ఇచ్చిన (ఆ కాలంలో ఏమీ రాయలేదు అని స్వయంగా అల్లం రాజయ్య నే చాలాసార్లు పేర్కొన్నారు.) ఆయన గత 6,7ఏళ్ల నుండి మళ్లీ రాస్తున్న మరియు రాసిన వాటి గురించి ; కథా రచయితగా ఆయన సాధించిన ఘనత గురించి రాయలేదు.  ప్రత్యేకంగా కాకపోయినా వివిధ కథా సంకలనాల్లో ఆయన రాసిన నూతన కథలు అచ్చవుతున్నాయి. ఉదాహణకు కొత్త కథ -2018 (కథా సంకలనం). 2015లో "కథా స్రవంతి - అల్లం రాజయ్య కథలు" ను అరసం ప్రచురించింది. అలాగే అల్లం రాజయ్య కథా సాహిత్యం ని ఉస్మానియా, కాకతీయ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్  విశ్వవిద్యాలయాలు పి.హెచ్. డి, ఎం. ఫిల్ ప్రవేశ పరీక్షల సిలబస్ లో మరియు ఎం.ఏ తెలుగు పాఠ్యాంశాలలో ఒక టాపిక్ గా చేర్చాయి... లాంటి విషయాలని అప్డేట్ చేయలేదు. పైగా ఆయన సాహిత్య కృషిని వివరిస్తూ తోకల రాజేశం రాసిన జిల్లా సాహిత్య చరిత్ర నుండే 3 పేరాలను యథాతథంగా రాసేశారు. కానీ ఆధార గ్రంథంగా సూచిస్తూ దాని గురించి రాయలేదు. పరిశోధనకు సంబంధించి తొలిసారిగా 1987లో శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసిన కె. నాగేశ్వర చారి పేరును పేర్కొనలేదు.  ఇక పరిశోధకురాలు ఎం.విజయలక్ష్మి చేసిన కృషి 1997 అయితే 1977 అని తప్పుగా ముద్రించబడింది. తల్లిచేప కథా సంపుటిని ప్రస్తావిస్తూ వరవర రావు రాసిన ముందు మాటల్ని పేర్కొన్నారు కానీ, అల్లం రాజయ్య సాహిత్యానికి సంబంధించి వరవరరావు రాసిన 285 పేజీల ముందు మాటలన్నీ కలిపి "జైత్రయాత్ర (2021)"అనే పుస్తకంగా వచ్చిన విషయాన్ని కూడ పేర్కొంటే బాగుండేది. ఇక "అల్లం రాజయ్య సాహిత్య అధ్యయన కేంద్రం " పేరుతో ఫేస్బుక్ లో ఓ పేజీని రూపొందించి అందులో అల్లం రాజయ్య కు సంబంధించిన పాత, కొత్త విషయాలు అన్నీ ఒక పరిశోధన స్థాయిలో సంకలనం చేస్తున్న జిల్లాకే చెందిన కథా రచయిత ఇట్యాల వెంకట కిషన్ కృషి గురించి రాస్తే భావి రచయితలకు, పరిశోధకులకు మరెంతో మార్గదర్శకంగా ఉండేది.

ఇక "దళిత కథలు" రాసిన గూడ అంజయ్య గురించి రాస్తూ రచయిత్రి కథల గురించి తన అభిప్రాయాలను కాకుండా పుస్తకంలో రాసిన రచయిత అభిప్రాయాలనే యథాతథంగా తీసుకున్నారు. అలాగే ఈ కథలు శాతవాహన యూనివర్సిటీ  ఎం.ఏ తెలుగు పాఠ్యాంశాలలో చేర్చిన విషయం గురించి రాయలేదు.  ఆ తర్వాత జిల్లాలో 3వ ప్రముఖ కథకుడిగా తన భర్త అయిన అల్లాడి శ్రీనివాస్ (ఈ పుస్తకం కోర్ కమిటీ సభ్యుడు)ని చూపే ప్రయత్నం చేసింది. ఇది మనకు ఆయన గురించి రాసిన మొదటి వాక్యంలోనే అర్థమవుతుంది. 2019లో కేవలం 16కథలతో ముద్రితమైన ఒకే ఒక కథా సంపుటాన్ని వర్ణిస్తూ అవసరమైన దాని కన్నా ఎక్కువ స్పేస్ నే తీసుకొని ఎప్పటి నుండో రాస్తున్న మిగతా కథకులని చిన్నబుచ్చింది.

అభివృద్ధిలోనూ, అక్షరాస్యతలోనూ ఎప్పుడూ వెనుకబడే ఉన్న అడవి జిల్లాల వారసులం మనం. మన ప్రాచీన చరిత్ర సరిగ్గా రికార్డు కాలేదో.. మరి రికార్డ్ అయిన దాన్ని కూడ మనం గుర్తించ లేకపోతున్నామో, భద్రపరచ లేకపోతున్నామో గానీ ఓహ్ 30,40 ఏళ్ల కిందటి తెలిసిన సంగతుల్లోకే తప్ప మరింత లోతుల్లోకి వెళ్ళలేక పోతున్నాం. ఈ వ్యాసకర్త కూడ ప్రస్తుతం కథలు రాసిన వారి గురించి తప్ప చరిత్రని తవ్వే ప్రయత్నం చేయలేదు. అందువల్ల మంచిర్యాలకే చెందిన ఓ ఇద్దరి రచయితల ప్రస్తావన ఈ వ్యాసంలో మిస్సయింది. వారే నాగుల రాధే శ్యామ్, సిరిమల్లె రూప. ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు(కారా మాస్టారు) 1996లో ప్రచురించిన ఋతుపవనాలు అనే కథా సంకలనంలో నాగుల రాధేశ్యాం రాసిన "జింకపిల్ల" కథతో పాటు సిరిమల్లె రూప రాసిన "ఝాన్సీ" కథ  ప్రచురితమయ్యాయి. అలాగే సిరిమల్లె రూప రాసిన "పనిపిల్ల" కథ ఆహ్వానం పత్రికలో జూలై 1, 1996లో ప్రచురితమైనట్లు కథానిలయం వెబ్సైట్ ద్వారా మనకు తెలియవస్తోంది.

12 వ వ్యాసం ఈ పుస్తక కోర్ కమిటీ సభ్యుడిగా కూడ ఉన్నటువంటి దండేపల్లి కి చెందిన  ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ప్రభుత్వ పాఠ్య పుస్తకాల రచయిత  కొండు జనార్ధన్ రాసిన "జిల్లా నవలా రచయితలు".  అల్లం రాజయ్య ని ఇందులో జిల్లా తొలితరం నవలా రచయితగా పేర్కొన్నారు కానీ ఈయన కంటే ముందే వానమామలై వరదచార్యులు మానవులంతా మనవాళ్ళే అనే నవల రచించారు. అయితే అది అముద్రితం. దీని గురించి ఇంతవరకు జిల్లాకు సంబంధించిన ఏ చరిత్ర  పుస్తకాల్లోనూ రాయలేదు. అల్లం రాజయ్య 1975లో ఉద్యోగ రీత్యా మంచిర్యాలకు వచ్చారు, స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. సృజన మాస పత్రిక 1977  ఆగస్ట్, సెప్టెంబర్ సంచికల్లో అల్లం రాజయ్య మొదటి కథ "ఎదురు తిరిగితే " ప్రచురించబడింది. కానీ అప్పటికే ఇక్కడ లబ్ధ ప్రతిష్టుడైన కవి వానమామలై ఉన్నారు. నవల ముద్రితం కాకున్నా రాసి ఉన్నారు. అలాంటప్పుడు జిల్లా తొలితరం నవలా రచయిత అల్లం రాజయ్య ఎలా అవుతారు..? అల్లం రాజయ్య రచనలపై పరిశోధనలు జరుగుతున్నాయి అని పేర్కొన్న రచయిత వాటి వివరాలు తెలియజేయలేదు. కనీసంగా ఆన్లైన్లో అందుబాటులో ఉన్న, ఆయన నవలా సాహిత్యం కు సంబంధించి 1995లో పి.హెచ్.డి పట్టా కోసం శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో రాచపాళెం చంద్రేఖరరెడ్డి ఆధ్వర్యంలో పరిశోధన చేసిన కె. నాగేశ్వర చారి " మహా శ్వేతా దేవి - అల్లం రాజయ్య నవల ల తులనాత్మక పరిశీలన "ను పేర్కొనలేదు. ఇక ఒక్కో నవల గురించి సంక్షిప్తంగా పరిచయం చేసే క్రమంలో అగ్ని కణం నవలలో ప్రధాన పాత్ర పేరు మాదిగ బయ్యక్క అయితే బక్కయ్య గా ముద్రించారు. గూడ అంజయ్య రచనల గురించి రాస్తూ పొలిమేర(నవల)తో పాటు పొద్దు పొడుపు ముఖ్యమైనవి అని పేర్కొన్నారు. పొద్దుపొడుపు పేరుతో ఆయన ఇంతవరకు ఏ కథ గానీ,నవల గానీ రాయలేదు. మరి ఈ పొద్దు పొడుపు ఏంటో వ్యాసకర్తనే చెప్పాలి. ఈ వ్యాసం ఉద్దేశ్యమే ఆయా రచయితల నవలలను పరిచయం చేయడం, కుదిరితే వాటి విశ్లేషణ చేయడం. కానీ జనార్ధన్ కేవలం ఈ నవల కు సంబంధించి 2 వాక్యాలు రాసి మిగతా 2 పేజీలు అంతా నవలా రచయితని పోగడటానికే వాడుకున్నాడు. విశేషమేమిటంటే కనీసం ఈ నవలలోని అంశం ఏంటో కూడ ఇందులో రాయలేదు. కొత్తగా మరో ఇద్దరు కూడ నవలలు రాశారు అని వివరణలు ఇచ్చారు గానీ వాటిలో ఏవి ముద్రిత్రమో అముద్రితమో స్పష్టంగా పేర్కొనలేదు. ఇంకా ఇక్కడి సింగరేణి కార్మికోద్యమ చరిత్రను తన నవలల్లో, కథల్లో రికార్డ్ చేసిన రచయిత పి  చంద్ ఉరఫ్ ఊరగొండ యాదగిరి చేసిన కృషిని గానీ, ఆయన రచన మా ఊరి కథ(నవల)ని గానీ పేర్కొని ఉంటే బాగుండేది.

13వ వ్యాసం ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఈ పుస్తక కోర్ కమిటీలో కూడ సభ్యుడైన దండనాయకుల వామన రావు రాసిన "జిల్లా గేయ సాహిత్యం". వ్యాసం మొదటి పేరాలోనే ఈ వ్యాస ఆధారాలు, ప్రాతిపాదికలు అన్నిటినీ పేర్కొని తనపై విమర్శలు రాకుండా జాగ్రత్త పడ్డాడు కానీ రాసినంత వరకైనా సమగ్రంగా ఉందా లేదా అని సరిచూసుకోలేదు. వానమామలై వరదచార్యుల గేయ కావ్యాలను మూడింటినీ పేర్కొన్న వ్యాసకర్త..పూర్తి వివరాలకు ఇదే పుస్తకంలోని వేరొకరి వ్యాసం చూడండి అని చెప్పడం సమంజసం అనిపించలేదు. ముద్రిత గీత సంపుటులే అయిన స్తోత్ర రత్నావళి, గీత రామాయణం, హనుమాన్ చాలీసా అనువాదాలను నామ మాత్రంగా కూడ రాయలేదు. తర్వాత గూడ అంజయ్య రాసిన ఒక పుస్తక సంకలనం ఊరు మనదిరా గురించే రాసారు కానీ ఆ తర్వాత 1992-2006 మధ్య రాసిన తెలంగాణ పాటలను "తెలంగాణ పాటలు పేరుతో అచ్చు వేసిన సంగతి, వాయిస్ ఆఫ్ తెలంగాణ పేరుతో ఆడియో క్యాసెట్లు,సీడీలు వచ్చిన సంగతి, ఇంకా గూడ అంజయ్య సిన్మా పాటలు(2007) సంకలనం గురించి గానీ రాయలేదు. బహుశా వానమామలై గురించి మరొకరి వ్యాసాన్ని చదవండి అని సూచించినట్లుగానే, గూడ అంజయ్య గురించి కూడ మరొకరి వ్యాసంలో చదువుకోండి అందామనుకోవచ్చు. కానీ అది కూడ రాయడం మర్చిపోయాడు. ఇక గేయ సంపుటిని ప్రచురించిన వారికే ప్రాధాన్యం అని చెప్పుకున్న వ్యాసకర్త మరి అందరి గేయ సంపుటులని ఎందుకని పేర్కొనలేదు. వ్యాసంలో పేర్కొన్న  33మందిలో 13మంది పుస్తకాలు ప్రచురించని విషయం గుర్తుకు రాలేదేమో!. పోనీ ప్రచురించిన వారి పేరైనా పేర్కొన్నారా అంటే అదీ లేదు. 2019 మార్చి 10న "భక్తి పాటలు" పేరిట పుస్తకం విడుదల చేసిన కనుకుంట్ల కమల(పుష్పలత)ని ప్రస్తావించలేదు. అన్నిటికన్నా పరాకాష్ట అసలు పాటే రాయని అంతడుపుల నాగరాజును గేయకర్త చేసేసి, అతను నృత్య దర్శకత్వం వహించిన వీడియోలను ఆధారాలుగా పేర్కొనడం. ఇక ఆయన గురించి కూడ కొన్ని తప్పులు దొర్లాయి. అంతడ్పుల నాగరాజు సాధారణ  ధూమ్ ధాం కళాకారుడు కాదు, ఆయనే ఆ నృత్య రూప కల్పన కు వ్యవస్థాపకుడు. ఆయన దర్శకత్వం వహించిన ఎన్నో సూపర్ హిట్ పాటలు ఉండగా అవన్నీ వదిలేసి ఎప్పటివో ఒక 5 ఆల్బమ్ పేర్లు పేర్కొన్నారు. అందులోనూ అక్షర దోషాలే. జానపదం కాదు, "ఊరంతా జానపదం" ఆయన ఆల్బమ్ పేరు. ఇక ఒకే ఒక్క పాట రాసి(?) ప్రాచుర్యం పొందిన గాయని మధుప్రియ ని కూడ గేయ కవిగా పేర్కొన్నారు. మరి 2షార్ట్ ఫిలిం సాంగ్స్ తో పాటు 62 పేరడీ పాటలు రాసిన నా గురించి ఎందుకు రాయలేదో? రాయాలని అనిపించలేదో?..అందులో 12 పేరడీ పాటలు సూర్య, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి దినపత్రికలలో అచ్చయిన సంగతి తెలియదా. మిగతా పాటలు 2017 లో ఈటీవీ ప్లస్ ముకాబ్ లా పేరడీ షో లో మొదటి నుండి చివరి వరకు ప్రసారమైన సంగతి తెలియదా..? ఇదంతా పక్కన పెడితే ఒక కోర్ కమిటీ సభ్యుడిగా తనకు అప్పజెప్పిన బాధ్యత అయినా సరిగ్గా నెరవేర్చారా..? నాకు ఒక వ్యాసం రాయమని చెప్పి, 15రోజుల్లోనే గడువు అయిపోయింది అని నాతో ఎందుకు చెప్పినట్లు. అదే మిగతా వాళ్ళకి 6నెలల సమయం ఇచ్చి మళ్లీ మళ్లీ అడిగి ఎందుకు రాయించుకున్నట్లు..? బహుశా నేను రాసిన వ్యాసం లేకపోతేనే సారస్వత పరిషత్ సంతృప్తి చెంది ముద్రిస్తాను లేకుంటే ముద్రించను అని హెచ్చరించినదేమో పాపం.

ఇక ఎలాగో గేయం గురించి వ్యాసం రాశాను కదా అనుకుని అదే ఊపులో "మంచిర్యాల వైభవం" పేరుతో ఓ గేయం కూడ రాశారు ఈ వ్యాసకర్త. కానీ అది ఈ వ్యాసానికి సంబంధం లేకుండా ప్రత్యేకంగా పుస్తకం చివరి పేజీలో ప్రచురించారు. కానీ మనకు విషయ సూచిక లో 47వ అంశంగా, దీన్ని ఒక కవిత గా పేర్కొన్నారు. మరి ఆ కవిత/గేయం కోసం ప్రత్యేకంగా ఎప్పుడో చివరన రాసేకన్నా ఇప్పుడే దాని గుట్టు విప్పాలని ఇక్కడే రాస్తున్న. అసలు ఒక జిల్లా కు సంబంధించి ఎటువంటి ప్రత్యేకతలు చెప్పకుండా ఒక జిల్లా గేయం రాయడం, ఆ జిల్లా పేరు తీసేసి ఏ ప్రాంతం పేరు పెట్టినా అది అన్నిటికీ సెట్ అయ్యేలా ఉండటం సామాన్య విషయం కాదు. అందుకే కావొచ్చు పుస్తక కమిటీ ఆగమేఘాల మీద ఆమోదించి, పరిషత్ సంతృప్తి చెంది  ప్రామాణికమైన జిల్లా ఘన చరిత్ర ను ఈ గేయం ద్వారా తెల్సుకొండి అని ముద్రించారు. ఈ గేయం గురించి ఇంతకన్నా ఎక్కువ చెప్తే రసజ్ఞులైన మీ పాఠక హృదయాలు మరింత గాయపడవచ్చు అని ఇంతటితో ఆపేస్తున్న.

14వ వ్యాసం సినీ సాహిత్య పరిశోధన లో డాక్టరేట్ పట్టా పొందిన తెలుగు ఉపన్యాసకుడు జక్కుల రాయమల్లు రాసిన "సాహిత్య పరిశోధకులు - విమర్శకులు". ఈ వ్యాసంలో జిల్లాలోని సాహితీ పరిశోధకుల గురించి సంక్షిప్తంగా అయినా బాగా రాసారు. ఒక రకంగా ఈ పరిశోధకుల సమాచారం రాబట్టడం ధ్రువీకరించడం అంత సులువు కాదు. అయినా కూడా ఈ విషయంలో వ్యాసకర్త సఫలీకృుతుడయ్యాడనే చెప్పొచ్చు. ఒక వేళ లోపాల గురించి, సమగ్రంగా అందర్నీ ప్రస్తావించాడా లేదా చెప్పాలన్నా కూడ అదొక పి.హెచ్ డి స్థాయి పరిశోధన అవుతుంది. కానీ నా వరకు నాకు తెలిసింది చెప్పాలి అనుకుంటున్న. బెల్లంపల్లి కి చెందిన ఇవటూరి అనురాధ "వానమామలై వరదచార్యుల కృతమైన పోతన చరిత్రము- సమగ్ర పరిశీలన" పేరుతో 2006-07లో  ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లో పరిశోధించి ఎం. ఫిల్ పట్టా పొందారు. అయితే  వ్యాసంలో ఈమె గురించి రాయలేదు. ఇక విమర్శ వ్యాసాల విభాగంలో నా గురించి రాశారు. కానీ ఓ పరిశోధనాభిలాషిగా నేను  ఇప్పటివరకు 14 జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని పరిశోధన పత్రాలు సమర్పించాను. 2019 నుండి వరుసగా ఏడాదిన్నర పాటు ప్రతి బుధవారం నవ తెలంగాణ దినత్రిక "అంకురం" శీర్షికలో జిల్లా సాహిత్యకారుల గురించే ప్రత్యేకంగా రాశాను. ఒక రకంగా మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర కన్నా ముందే పత్రికా ముఖంగా ఇక్కడి సాహిత్యకారుల గురించి నేను వ్యాసాలు రాశాను. అయినా కూడ జిల్లా సాహిత్య చరిత్ర పుస్తకంలో గానీ,ప్రస్తుత ఈ గ్రంథంలో గానీ దాని ప్రస్తావనే లేదు. నేను ప్రత్యక్షంగా పరిచయం లేకున్నా, మాట్లాడుకున్నా ఎక్కడో  బాసరలో ఉన్న ఈ వ్యాసకర్తకి కూడ నా సాహిత్య కృషి తెలిసి ఓ రెండు వాక్యాలైనా రాశాడు కానీ ఎప్పుడూ నాతో పలకరిస్తూ నా ప్రతీ పనిని గమనిస్తూ ఉండే తోటి సాహిత్యకారులు ఎందుకు రాయలేకపోయారు.? ఇందులో ఏమైనా కుట్ర ఉందనుకోవాలా..?

19 January 2023

No comments:

Post a Comment